ED : మహేష్‌బాబుకి ఈడీ నోటీసులు !

0

టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేశ్‌బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 27న విచారణకు హాజరుకావాలంటూ తాఖీదులిచ్చింది. సాయిసూర్య, సురానా గ్రూప్‌ వ్యవహారంలో మహేశ్‌కు నోటీసులు జారీచేసింది. సురానా గ్రూప్‌ , సాయి సూర్య డెవలపర్‌ల వ్యవహారంలో అధికారులు నోటీసులు ఇచ్చారు. సాయి సూర్య డెవలపర్స్‌, సురానా ప్రాజెక్టులకు మహేశ్‌బాబు ప్రచారకర్తగా ఉన్నవిషయం తెలిసిందే. ఇందుకుగాను సాయి సూర్య డెవలపర్స్‌ నుంచి రెమ్యూనరేషన్‌గా రూ.5.9 కోట్లు తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది. ఇందులో రూ.3.4 కోట్లు నగదు రూపంలో, రూ.2.5 కోట్లు ఆర్‌టీజీఎస్‌ ట్రాన్స్‌పర్‌ జరిగినట్లు విచారణలో తేలింది.

పక్కా పథకం ప్రకారం పలువురి మోసం

ఈ నేపథ్యంలో కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్‌ఫ్లుయెన్స్‌ చేశారని మహేశ్‌పై ఈడీ అభియోగాలు మోపింది. సురానా గ్రూపునకు చెందిన భాగ్యనగర్‌ ప్రాపర్టీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ చైర్మన్‌ నరేంద్ర సురానా, అనుబంధ సంస్థ అయిన సాయిసూర్య డెవలపర్స్‌ యజమాని సతీశ్‌చంద్ర గుప్తా పక్కా పథకం ప్రకారం పలువురిని మోసం చేసినట్లు ఈడీ విచారణలో గుర్తించారు. సొంతింటి కోసం అడ్వాన్స్‌లు ఇచ్చిన పలువుర్ని వంచించినట్లు తేల్చారు. ఈ రెండు కంపెనీల ద్వారా అనధికార లేఅవుట్లలో ప్లాట్లు అమ్మారని, ఒకే ప్లాట్‌ను బైనంబర్ల ద్వారా పలువురికి రిజిస్ట్రేషన్లు చేశారని, సరైన అగ్రిమెంట్లు లేకుండా నగదు రూపంలో డబ్బు తీసుకున్నారని విచారణలో గుర్తించారు. ఇలా రూ.100 కోట్లకు పైగా నల్లధనాన్ని సేకరించి, ఆ డబ్బును వివిధ మార్గాల ద్వారా దారి మళ్లించారని ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఈ రెండు కంపెనీలపై హైదరాబాద్‌లోని వివిధ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదైన నేపథ్యంలో తాము ఈసీఎన్‌ఆర్‌ నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. నెల 16న హైదరాబాదులో సురానా గ్రూప్‌, సాయి సూర్య డెవలపర్లలో ఈడీ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు జరిగిన సోదాల్లో రూ.74.50 లక్షల నగదు, రూ.100 కోట్ల నల్లధనానికి సంబంధించిన లెక్కలు గుర్తించామని చెప్పారు. నరేంద్ర సురానా కార్యాలయం నుంచి లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇక సతీశ్‌చంద్రపై ఇప్పటి వరకు పలు పోలీస్‌ స్టేషన్లలో 11 కేసులు నమోదైనట్లు చెప్పారు.

బ్యాంకులకు భారీగా ఎగవేత ! 

సురానా గ్రూప్‌, సాయి సూర్య డెవలపర్లలో ఈడీ అధికారులు చేసిన సోదాల్లో భాగంగా సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలోని సురానా ఇండస్ట్రీస్‌ ఎండీ నరేంద్ర సురానా ఇంట్లో భారీగా నగదు పట్టుబడిరది. సురానా ఇండస్ట్రీస్‌ అనుబంధ కంపెనీ, సాయి సూర్య డెవలపర్స్‌ సంస్థ ఎండీ సతీశ్‌ చంద్రగుప్త ఇంట్లో కూడా భారీగా నగదును సీజ్‌ చేశారు. సాయి సూర్య, సురానా కార్యాలయాల్లో పలు డాక్యుమెంట్స్‌ కూడా స్వాధీనం చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితమే సాయిసూర్య డెవలపర్స్‌కు చెందిన సతీశ్‌ను సైబరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. వట్టి నాగులపల్లిలో వెంచర్‌ పేరుతో డబ్బులు వసూలు చేసి సతీశ్‌ మోసం చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబరాబాద్‌ పోలీస్‌ కేసు ఆధారంగా సాయి సూర్య డెవలపర్స్‌పై ఈడీ విచారణ చేపట్టింది. సురానా సంస్థ పలు షెల్‌ కంపెనీలు ఏర్పాటు చేసి అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. సునారా గ్రూప్‌ మూడు బ్యాంకులకు రూ. 3,986 కోట్లు ఎగ్గొట్టింది. రుణాలు తిరిగి చెల్లించకపోవడంపై సీబీఐ (%జదీI%) మూడు కేసులు నమోదు చేసింది. సురానాకు అనుబంధంగా సాయిసూర్య డెవలపర్స్‌ పనిచేస్తోంది. 2021 ఫిబ్రవరిలో సురానా కంపెనీలో జరిగిన ఈడీ సోదాల్లో రూ. 11 కోట్ల 62 లక్షల విలువైన బంగారం, నగదు సీజ్‌ చేశారు. సురానా గ్రూప్‌ అనుబంధ సంస్థలపై పీఎంఎల్‌ఏ కేసు కూడా నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు దాడులు చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !