పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారంటూ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై మల్లన్న మీడియాతో మాట్లాడుతూ... తనను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయించి రేవంత్ రెడ్డి చాలా పెద్ద పొరపాటు చేశారని అన్నారు. బీసీలకు రాజ్యాధికారం ఎందుకు రాదో.. చూస్తామన్నారు. ‘‘నన్ను సస్పెండ్ చేస్తే.. బీసీ ఉద్యమం ఆగిపోతుందన్న భ్రమలోంచి రేవంత్ బయటకు రావాలి. నాలాంటి వాళ్ళు పక్కన ఉండొద్దని సీఎం రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారు. ఈడబ్ల్యూఎస్ కోటాకు ఇబ్బంది ఉండకూడదన్న ఉద్దేశంతోనే కుల గణనను తప్పుగా చూపారు. 90 ఏళ్ళ తర్వాత కుల గణన చేస్తే.. చపట్లు కొట్టేటోడు కూడా లేడు. కుల గణనపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చకు రెడీ. పీసీసీ అధ్యక్షుడిపై ఒత్తిడి చేసి రేవంత్ రెడ్డికి నన్ను సస్పెండ్ చేయించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తానన్న రాహుల్ గాంధీ హామీతోనే కాంగ్రెస్లో చేరాను. తన పక్కన వారు బానిస మాదిరి బతకాలని రేవంత్ కోరుకుంటారు. రేవంత్ చేసిన కులగణన చిత్తు కాగితంతో సమానం. సొంత మంత్రులకే ముఖ్యమంత్రి పేరు గుర్తుకు రావటం లేదు’’ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.
అంతర్గత ప్రజాస్వామ్యం అగ్రవర్ణాలకు మాత్రమే
2011లో రాహుల్ గాంధీ చేసిన పనినే తాను చేసినట్లు తెలిపారు. మన్మోహన్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ను రాహుల్ గాంధీ చించలేదా?.. కోమటిరెడ్డి బ్రదర్స్కు ఒక న్యాయం.. మల్లన్నకు ఒక న్యాయమా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం అగ్రవర్ణాలకు మాత్రమే అని వెల్లడిరచారు. ముఖ్యమంత్రి, మంత్రులు.. కులగణనలో నిర్లక్ష్యంగా పాల్గొన్నారని తెలిపారు. అగ్రవర్ణాలను ఎక్కువ చూపి.. బీసీలను తొక్కి పెట్టారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి.. పదే పదే తప్పులు మాట్లాడుతూ దొరికిపోతున్నారని అన్నారు. కాంగ్రెస్ నుంచి తనను సస్పెండ్ చేసినంత మాత్రాన బీసీ ఉద్యమం ఆగదని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. కాంగ్రెస్లో ఉంటే ప్రశ్నిస్తున్నాననే తనను బహిష్కరించారని తెలిపారు. కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే పకడ్బందీగా చేశారన్నారు. ప్రస్తుత కులగణనలో అగ్రవర్ణాలను ఎక్కువగా చూపించారని ఆరోపించారు. బీసీ వర్గాలను అణిచిపెట్టే ప్రయత్నం చేశారని, అందుకే బీసీ కులగణన తప్పని ప్రతులను కాల్చినట్లు వెల్లడిరచారు.
నన్ను గెలిపించారా..
ప్లాన్ ప్రకారం కాంగ్రెస్ను ఖతం చేసే పనిలో సీఎం రేవంత్ ఉన్నారంటూ సంచలన కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ .. ప్రధాని మోదీ ఒకరికి ఒకరు సహకరించుకుంటున్నారన్నారు. మల్కాజిగిరి, చేవెళ్ళ, మహబూబ్నగర్ ఎంపీలను బీజేపీ గెలవటానికి రేవంత్ సహకరించారని ఆరోపించారు. బలమైన కేసీఆర్తో తాను కొట్లాడినప్పుడు రేవంత్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. మహబూబ్నగర్ ఎంపీగా వంశీచంద్ రెడ్డిని.. రేవంత్ రెడ్డే ఓడిరచారన్నారు. మహబూబ్నగర్, మల్కాజిగిరి ఎంపీలను గెలిపించుకోలేని రేవంత్ .. తనను గెలిపించారా అంటూ మండిపడ్డారు. రేవంత్ కూర్చున్న సీఎం కుర్చీకి పునాది పడటానికి తన కష్టం ఉందని స్పష్టం చేశారు.
బీసీ ముఖ్యమంత్రి ఖాయం..
‘‘నా రెక్కల కష్టంతోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి రావటానికి నా పాత్ర కూడా ఉంది. కేసీఆర్ నియంత పాలనలో కాంగ్రెస్కు.. నా న్యూస్ ఆఫీస్ గాంధీ భవన్గా మారింది. నేను ప్రచారం చేసిన 45 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 42 సీట్లు గెలిచింది. రేవంత్కు నచ్చకున్నా.. 2028లో బీసీ ముఖ్యమంత్రి ఖాయం. హనుమంతరావు, అంజన్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళకు కాంగ్రెస్లో స్చేచ్చ లేదు. అధికారంలోకి వచ్చి 15 నెలలు అయినా.. కాంగ్రెస్ కార్యకర్తలు సంతోషంగా లేరు. గౌడ్ కోటాలో జగ్గారెడ్డి సతీమణికి కార్పోరేషన్ పదవి వచ్చింది. రెడ్డిలు పప్పు, బెల్లం లెక్క కార్పొరేషన్ పదవులు పంచుకున్నారు’’ అంటూ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు చేశారు. అలాగే సోమాజీగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించిన మల్లన్న ప్రెస్మీట్కు బీసీ జేఏసీ నేతలు మద్దతు తెలిపారు.
బీజేపీకి సహకరిస్తున్న రేవంత్ రెడ్డి !
బీజేపీకి పరోక్షంగా రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారు. సంవత్సరంలోనే ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత ఎందుకు?. ఆత్మపరిశీలన చేసుకోవాలి. వంశీ చందర్రెడ్డిని ఓడగొట్టింది మీరే. పార్టీ నేతలు తన మాట వినడం లేదని రేవంత్ రెడ్డి అలిగి పోతున్నారట. ప్రసన్న హరికృష్ణ కాంగ్రెస్ను ఓడిస్తున్నాడు. 2028లో తెలంగాణకు బీసీనే ముఖ్యమంత్రి అవుతాడు. పిల్లి గాండ్రిరపులకు భయపడేది లేదు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో అన్ని బీసీ సంఘాలకు ఒకే ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేస్తాం. అందరినీ ఏకం చేస్తాం. వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో బీసీలను నిలబెడుతాం. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే ఆలోచన లేదు. మండలిలో మాట్లాడేది చాలా ఉంది. ప్రధాని మోదీ నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అదే విధంగా 42 శాతం బీసీ రిజర్వేషన్లు సాధించాలి అని తెలిపారు.