ముంబైలో సైబర్ నేరగాళ్ల గుట్టరట్టు చేశారు పోలీసులు. అమాయకుల ఆధార్ కార్డులతో బ్యాంక్ అకౌంట్లు తెరిచి కోట్లు కొట్టగొడుతున్న కంత్రీగాళ్ల పనిపట్టారు. బిగ్ సైబర్ క్రైమ్ను చేధించారు ముంబై పోలీసులు. పేదల పేరుతో బ్యాంక్ అకౌంట్లు తెరిచి మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్ల ఆటకట్టించారు. 60 కోట్ల రూపాయలకు పైగా మోసాలకు పాల్పడ్డ ముఠాను అరెస్ట్ చేశారు. ఈ కేసులో మొత్తం 12 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెల్లడిరచారు. ముంబై నుంచి థాయ్లాండ్, మలేషియాకు ఈ నెట్వర్క్ను విస్తరించినట్లు గుర్తించారు. పలు టీమ్లుగా విడిపోయిన దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు కేసులో ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.
పేదలే టార్గెట్ !
ముంబై మురికివాడలకు చెందిన పేదలకు డబ్బు ఆశ చూపించి ఆధార్, పాన్ కార్డులను సేకరించారు. ఆ ఐడెంటీటి కార్డుపై ఫోన్ నంబర్స్ తీసుకునేవారు. ఆపై బ్యాంక్ ఖాతాలను తెరిచి, ట్రాన్సాక్షన్స్ చేసేవారు. ఇలా సైబర్ క్రైమ్ కోసం మొత్తం 943 బ్యాంక్ అకౌంట్లు తెరిచారు. ముంబై నుంచి కోటి 67 లక్షల రూపాయలు, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి 10 కోట్ల 57 లక్షల రూపాయలు, ఇలా దేశ అంతటా కలిపి మొత్తం 60 కోట్ల 82 లక్షల రూపాయలను నిందితులు దోచుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆన్లైన్ గేమింగ్, షేర్ ట్రేడిరగ్, ఈ కామర్స్ వంటి మోసాల్లో ఈ ముఠా ఆరితేరింది. వీరి నుంచి 50కి పైగా బ్యాంక్ పాస్ బుక్స్, 105 సిమ్ కార్డ్స్, వందలాది ఏటీఎం కార్డులతో పాటు స్వైప్ మిషన్లు సైతం స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
వ్యవస్థీకృతంగా దోపిడీ !
ముంబైలోని కండివాలిలో ఉన్న ‘డిజి సర్జ్ కన్సల్టెన్సీ’, ‘ప్రిటిట్ లాజిస్టిక్స్’ అనే రెండు సంస్థల ముసుగులో ఈ స్కామ్ జరిగింది. సైబర్ నేరస్థుల కోసం బ్యాంకు ఖాతాలను సృష్టించడంలో రెండు కంపెనీలు పని చేసినట్లు అధికారులు తెలిపారు. ఒక రహస్య సమాచారం మేరకు, క్రైమ్ బ్రాంచ్ ఆగస్టు 12న ఈ సంస్థలపై దాడి చేసింది. వైభవ్ పటేల్, సునీల్ కుమార్ పాస్వాన్, అమన్కుమార్ గౌతమ్, ఖుష్బు సుందర్జల, రితేష్ బండేకర్లతో సహా కీలక నిందితులను అరెస్టు చేసింది. సమతా నగర్ పోలీస్ స్టేషన్లో భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 318(4), 3(5) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న ల్యాప్టాప్ల నుండి డేటాను విశ్లేషించినప్పుడు, ముఠా సృష్టించిన 943 బ్యాంకు ఖాతాలు బయటపడ్డాయి. వీటిలో 181 ఖాతాలు సైబర్ మోసానికి చురుకుగా ఉపయోగించారు. దేశవ్యాప్తంగా 339 ఫిర్యాదులతో ముడిపడి ఉన్నాయి. వీటిలో ముంబైలో 16, మహారాష్ట్ర అంతటా 46, ఇతర రాష్ట్రాల నుండి 277 ఉన్నాయి. ఈ ఖాతాల ద్వారా వివిధ సైబర్ మోసాల పథకాల నుండి రూ.60.82 కోట్లు మళ్లించినట్లు పోలీసులు నిర్ధారించారు. ముంబై కేసులకు సంబంధించిన రూ.1.67 కోట్లు. మహారాష్ట్ర సంబంధిత మోసాల నుండి రూ.10.57 కోట్లుగా గుర్తించారు.