- దేశంలో కార్పొరేట్ వ్యవస్థ రాజ్యమేలుతోంది..
- ప్రభుత్వాన్ని, పాలకులను ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది..
- కోటీశ్వరులు, సామాన్యులు ఒకే ట్యాక్స్ కడుతున్నారు.. ఈ విధానాలు మారాలి..
- దేశంలో సామాన్యులకు, వారి నిర్ణయాలకు చోటు లేకుండా పోయింది: మీనాక్షి నటరాజన్
ప్రజాస్వామ్యంలో ఎవరైనా తమ సమస్యల పైన ప్రభుత్వాలను, పాలకులను ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. ఇందుకోసం ప్రత్యేక అనుమతులు అవసరం లేదని తెలిపారు. పర్యావరణ, ఉద్యమకారురాలు మేధాపత్కర్ లాంటి వారు మూసీ నది పరివాహక ప్రాంతంలో పర్యటించడానికి వెళ్లారు.. అది గొప్ప విషయం.. ఉద్యమాల్లో నేను మీతో కలిసి పని చేస్తా అని ఆమె వెల్లడిరచారు. ప్రతి ఒక్కరికి ప్రశ్నలను లేవనెత్తే హక్కులు ఉన్నాయన్నారు. ఇక, ప్రస్తుతం దేశంలో కార్పొరేట్ వ్యవస్థ రాజ్యమేలుతోంది అని కాంగ్రెస్ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరోపించారు. దేశంలో కోటీశ్వరులు, సామాన్యులు ఒకే టాక్స్ కడుతున్నారు.. అంబానీ, అదానీ, పాల పాకెట్ కొనుగొలు చేసే సామాన్యులు సమానంగా టాక్స్ లు కడుతున్నారు.. ఈ విధానాలు మారాలి అని పేర్కొన్నారు. అలాగే, దేశ ప్రజలు భారత్ మాతా జై అంటున్నారు కానీ.. సామాన్యులకు, వారి నిర్ణయాలకు చోటు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ, కేంద్ర ప్రభుత్వం కొందరు వ్యక్తుల నిర్ణయాల మేరకే పని చేస్తుంది.. ఆ విధానాలను మార్చాలని మీనాక్షి నటరాజన్ చెప్పుకొచ్చారు.