ఆన్లైన్ గేమింగ్ రంగాన్ని నియంత్రించే ‘ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025’ బుధవారం లోక్సభలో ఆమోదం పొందింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రవేశపెట్టిన ఈ బిల్లు, ప్రతిపక్షాల నిరసనల మధ్య పాస్ అయింది. దేశంలో బెట్టింగ్ యాప్ మాఫియా (Betting app mafia) కారణంగా అనేక కుటుంబాలు దెబ్బతింటున్నాయి. ప్రముఖులు, సెలబ్రిటీలతో ప్రచారంతో అనేక మోసాలు చేస్తున్న ఆన్లైన్ గేమింగ్ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను నియంత్రించడం, ఆర్థిక మోసాలకు చెక్ పెట్టడం ఈ బిల్లు ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. రియల్ మనీ గేమింగ్ (పోకర్, ఫాంటసీ స్పోర్ట్స్) నిషేధించడం, ఈస్పోర్ట్స్, ఎడ్యుకేషనల్ గేమ్స్, సోషల్ గేమ్స్ను ప్రోత్సహించడం దీని లక్ష్యం. అలాగే భారత్ను గ్లోబల్ గేమింగ్ హబ్గా మార్చాలని కూడా టార్గెట్ పెట్టుకున్నారు. ఈ బిల్లు ప్రకారం సెంట్రల్ ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఏర్పాటు చేస్తారు.
మరోసారి ఆలోచించండి అంటూ లేఖ !
ఇది గేమ్స్ను ఈస్పోర్ట్స్, ఎడ్యుకేషనల్, సోషల్, రియల్ మనీ గేమ్స్ అని నాలుగు రంగాలుగా వర్గీకరిస్తుంది. రియల్ మనీ గేమ్స్ను ఆఫర్ చేయోద్దు, వాటికి సహకారం అందివొద్దు.. అడ్వర్టైజ్మెంట్నూ నిషేధించారు. బ్యాంకులు కూడా వీటి లావాదేవీలు చేయకూడదు. రియల్ మనీ గేమ్స్ నిర్వహిస్తే మూడేండ్ల జైలు లేదా రూ.1 కోటి జరిమానా విధిస్తారు. రెండూ కూడా విధించవచ్చు. వీటిని అడ్వర్టైజ్ చేస్తే రెండేండ్ల జైలు, రూ.50 లక్షల ఫైన్. మళ్లీమళ్లీ చేస్తే ఐదేండ్ల జైలు, రూ.2 కోట్ల ఫైన్ విధిస్తారు. ఇవి కాగ్నిజబుల్, నాన్-బెయిలబుల్ నేరాలు. వీటిని ఆడేవారిని బాధితులుగా పరిగణిస్తారు. అయితే కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లుపై ఈ-స్పోర్ట్స్ ప్లేయర్స్ అసోసియేషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘గేమింగ్ కేవలం ఆట కాదు.. అది జీవనోపాధి’’ అంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ-స్పోర్ట్స్ ప్లేయర్స్ అసోసియేషన్ (E-Sports Players Association) ప్రధాని మోదీకి లేఖ రాసింది. Online Gaming Bill-2025పై ప్రధాని మోడీ మరోసారి ఆలోచించాలని.. ఈ నిర్ణయం తమపై తీవ్ర ప్రభావం చూపుతుందని గేమర్స్ ప్రధాని మోడీకి లేఖ రాశారు.