రాజమహేంద్రవరంలో జరిగిన మహానాడు వేదిక తెలుగుదేశం అధినేత చంద్రబాబు, తాజాగా విడుదల చేసిన టీడీపీ మేనిఫెస్టోపై ప్రభుత్వ సలహాదారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. చంద్రబాబును నిద్రలో లేపినా అవే అబద్దాలు చెబుతారు.. చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో అవినీతి, అరాచకంలో రికార్డు సృష్టించాడని.. పోతూ పోతూ 2 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టి వెళ్లాడని విమర్శించాడు. రైతు రుణ మాఫీ, డ్వాక్రా రుణ మాఫీ చేశానని ఎందుకు చెప్పటం లేదు? అని నిలదీసిన ఆయన.. ఏమీ చేయలేదు కనుకే.. ఏమీ చెప్పుకోలేక పోతున్నాడు.. చంద్రబాబు మాటలు కొత్త బిచ్చగాడిలా, మొదటిసారి మేకప్ వేసుకున్న నటుడిలా ఉన్నాయి అని సెటైర్లు వేశారు.బాబు ఏం చేశాడో చెప్పాలి కదా ?
ఇప్పుడు రాష్ట్రంలో విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి కీలక రంగాల్లో అభివృద్ధి కనిపిస్తోంది.. కానీ, 14 ఏళ్లు చంద్రబాబు ఎక్కడ గాడిదలు కాస్తూ ఉన్నాడు అని ఫైర్ అయ్యారు. కొత్తగా వచ్చిన రాజకీయ నాయకుడిలా ఏదో చేస్తానని ఎలా చెబుతాడు? అవకాశం ఇచ్చిన తర్వాత తాను ఏం చేశాడో చెప్పాలి కదా? అని నిలదీశారు.. ఇక, చంద్రబాబు నాయకుడు కాదు, మానిప్యులేటర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కళ్లార్పకుండా అబద్దాలు చెప్పే పోటీ పెడితే చంద్రబాబుకు గిన్నిస్ రికార్డు వస్తుందన్నారు. బెల్ట్ షాపులన్నీ రద్దు చేశాం, మద్యం వినియోగం గణనీయంగా తగ్గిందని తెలిపారు సజ్జల.. సీపీఎస్, ఓపీఎస్ కు మధ్యేమార్గంగా ఆలోచన చేస్తున్నాం.. రిటైర్ అయిన తర్వాత ఉద్యోగులు సంతోషంగా ఉండాలనేదే ప్రభుత్వ ఆలోచనగా స్పష్టం చేశారు. మా ప్రభుత్వంలో ఎన్నికల తాయిలాలు ఉండవు.. 2024, 2029 ఎన్నికలైన ప్రజలు జగన్ లాంటి చిత్తశుద్ధి ఉన్న నాయకుడినే కోరుకుంటారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.
