Congress Party : ప్రచారానికి డబ్బులేదని రాహుల్‌ గాంధీ ఆవేదన !

0

  • కాంగ్రెస్‌ బ్యాంక్‌ ఖాతాల స్తంభన ! 
  • నెల రోజులుగా అకౌంట్లు సీజ్‌ చేశారు !
  • ప్రజలు స్పందించాలి. 
  • ఇది ముమ్మూటికీ అధర్మయుద్ధమే !

లోక్‌సభ ఎన్నికల వేళ సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‌ పార్టీకి కొత్త కష్టాలు ఎదురువుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ ఖాతాలను స్తంభింపజేసి ఎన్నికల్లో తమకు డబ్బులు లేకుండా దెబ్బతీయాలని బీజేపీ చూస్తోందని పార్టీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే అన్నారు. ఇది ప్రజాస్వామ్యంపై అతి పెద్ద దాడి అని సోనియా గాంధీ అభివర్ణించారు. ఈ సందర్బంగా కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై కాంగ్రెస్‌ నేతలు తీవ్ర విమర్శలు చేశారు.తమ పార్టీని దెబ్బతీసేందుకే ప్రధాని మోదీ తీవ్ర చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల వేళ డబ్బులేకపోవడంతో ప్రచారం చేయలేకపోతున్నామన్నారు.

మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ.. 

లోక్‌సభ ఎన్నికల్లో లెవెల్‌ ప్లేయింగ్‌ ఫీల్డ్‌ ఉండాలి. బీజేపీ పెద్ద ఎత్తున రాజకీయ చందాలు వసూలు చేసింది. కానీ, వారు కాంగ్రెస్‌ పార్టీ ఖాతాలను స్థంభింపజేశారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. మా బ్యాంకు ఖాతాలను తక్షణమే ఆపరేట్‌ చేసేందుకు అనుమతించాలి. బీజేపీ అన్ని వనరులపై ఏకఛత్రాధిపత్యం వహిస్తోంది. మాకు డబ్బు లేకుండా చేసి ఎన్నికల్లో దెబ్బతీయాలని చూస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగాలంటే తమ బ్యాంకు ఖాతాలను అన్‌ఫ్రీజ్‌ చేయాలని కోరారు. అభ్యర్థులకు ఇచ్చేందుకు డబ్బు లేదన్నారు. సమయం చూసి కాంగ్రెస్‌ను దెబ్బతీస్తున్నారని దుయ్యబట్టారు. 

సోనియా గాంధీ మాట్లాడుతూ.. 

ఎన్నికల ముందు కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు. మా బ్యాంకు ఖాతాల్లోని డబ్బులను బలవంతంగా లాగేసుకుంటున్నారు. కాంగ్రెస్‌ను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రధాని మోదీ వ్యవస్థీకృతంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. నెల కిందట కాంగ్రెస్‌ అకౌంట్లను అక్రమంగా సీజ్‌ చేశారు. ఎలక్టోరల్‌ బాండ్స్‌​ ద్వారా కాంగ్రెస్‌కు 11 శాతం ఫండ్స్‌ మాత్రమే వచ్చాయి. ఫండ్స్‌ను కట్టడి చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. కేంద్రం తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎలక్టోరల్‌ బాండ్స్‌ ద్వారా బయటపడ్డ సమాచారంపై విచారణ జరగాల్సిందే. బీజేపీకి వచ్చిన బాండ్స్‌పై విచారణ జరగాలి. కాంగ్రెస్‌ను ఆర్థికంగా దెబ్బకొట్టాలని బీజేపీ చూస్తోంది. మరోవైపు దేశంలోని ప్రధాన ప్రతిపక్షం ఆర్థిక లావాదేవీలపై దాడి జరుగుతోంది. ఇన్ని సవాళ్ల నడుమ ఎన్నికల్లో మేం సమర్థంగా ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని ఆమె అన్నారు. 

రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. 

‘కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి పాల్పడుతున్న నేరపూరిత చర్య ఇది. కాంగ్రెస్‌కు సంబంధించిన అన్ని అకౌంట్లు ఫ్రీజ్‌ చేశారు. మా దగ్గర ఫండ్స్‌ లేవు. ఎన్నికల సమయంలో అకౌంట్లు పనిచేయకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఎలాంటి లావాదేవీలు చేయలేని పరిస్థితి. కాంగ్రెస్‌ను ఆర్థికంగా దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. కేవలం 14 లక్షల రూపాయలకు సంబంధించిన లెక్కల వివాదంపై మొత్తం కాంగ్రెస్‌ పార్టీ ఖాతాలను స్తంభింప చేశారు. రూ.200 కోట్లు జరిమానా వేశారు. ఆలస్య చెల్లింపుకు రూ.10వేలకు మించి జరిమానా వేయకూడదు. ప్రధానమంత్రి క్రిమినల్‌ చర్యలకు పాల్పడుతున్నారు. డబ్బులు లేకపోవడంతో ప్రచారాలు బుక్‌ చేసుకోలేకపోతున్నాం.  ప్రకటనలు ఇవ్వలేకపోతున్నాం. మా అభ్యర్థులకు సహాయపడలేకపోతున్నాం. విమాన టికెట్లు కాదు, కనీసం రైల్వే టికెట్లు కొనలేకపోతున్నాం. ఈ అంశంపై దేశంలోని రాజ్యాంగ సంస్థలు, ప్రజలు స్పందించాలి అని కోరారు. ఇది కేవలం కాంగ్రెస్‌ పార్టీ ఖాతాలను ఫ్రీజ్‌ చేయడం కాదని, భారత ప్రజాస్వామ్యాన్ని అడ్డుకోవడమని ఆయన దుయ్యబట్టారు. ‘‘ఈ రోజు దేశంలో ప్రజాస్వామ్యం అనేదే లేకుండా పోయింది. అది అబద్ధంగా మారింది. దేశంలో 20శాతం ఓటర్లు మాకు మద్దతుగా ఉన్నారు. కానీ మేం రెండు రూపాయలు కూడా చెల్లించలేకపోతున్నాం. ఎన్నికల్లో పోరాడకుండా మా సామర్థ్యాన్ని అడ్డుకుంటున్నారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టలేదు’’ అని కేంద్రంపై రాహుల్‌ మండిపడ్డారు. 

అజయ్‌ మాకెన్‌ మాట్లాడుతూ.. 

కాంగ్రెస్‌ పార్టీ ఖాతాల స్తంభన ప్రజాస్వామ్యంపైన దాడి వంటిది. మా ఖాతాలో ఉన్న రూ.285కోట్ల రూపాయలను ఖర్చు చేయలేకపోతున్నాము. ఐదు వారాల నుంచి ఎన్నికల్లో ప్రచారం కోసం ఖర్చు చేయడానికి నిధులు లేకుండా చేశారు. 30ఏళ్ల కిందటి లెక్కలను ఆధారం చేసుకుని ఇప్పుడు మా ఖాతాలను ఎలా స్పందింప చేస్తారు. అన్ని రాజకీయ పార్టీలకు మినహాయింపు ఉన్నట్టు మేము మినహాయింపులు పొందాము. కానీ, సరిగ్గా ఎన్నికల ముందు మా ఖాతాలు నన్ను స్తంభింపచేశారు. ఆదాయం పన్ను చట్టం 230ఎఫ్‌ ప్రకారం ఆలస్య చెల్లింపులకు 10 వేలకు మించి జరిమానా వేయకూడదు. 210 కోట్ల రూపాయల పెనాల్టీ వేశారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు. ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా ఎవరు లబ్ది పొందారో దేశం మొత్తానికి తెలుసని అజయ్‌ మాకెన్‌ ఆరోపించారు. ఇది అత్యంత తీవ్రమైన అంశమని అన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !