
తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. మంగళరం ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని ఇంటర్ బోర్డ్ కార్యాలయంలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి లాంఛనంగా విడుదల చేశారు. ఇంటర్ ఫలితాలను వెబ్సైట్లలో https://tsbie. cgg.gov.in, https://results.cgg.gov.in అందుబాటులో ఉంచారు. కాగా మార్చి, ఏప్రిల్ నెలలో తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగిన ఈ పరీక్షను 9,47,699 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. గతేడాది ఫలితాలు జూన్లో విడుదల కాగా.. ఈ ఏడాది ఒక నెల ముందుగానే విడుదల అయ్యాయి.
ఇంటర్ ఫస్టియర్లో 63.85 శాతం ఉత్తీర్ణత సాధించగా, సెకండియర్లో 67. 26 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఫస్టియర్లో 2 లక్షల 72వేల 208 మంది పాసవ్వగా, సెకండియర్లో 2 లక్షల 56వేల 241 మంది పాసైనట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 75. 27 శాతంలో మేడ్చల్ జిల్లా తొలి స్థానంలో నిలవగా, ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో 85.05 శాతంలో ములుగు జిల్లా అగ్రస్థానం సాధించింది. జూన్ 4వ తేదీ నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు మంత్రి సబిత తెలిపారు. అదే సమయంలో ఫెయిలైన విద్యార్థులు ఎవరూ కూడా ఆందోళన చెందొద్దని సూచించారు.