Odisha Train Tragedy : ఒడిశాలో రైళ్ళ ప్రమాదం...మాటలకందని మహావిషాదం !

0

ఒడిశా రాష్ట్రంలోని బాలేశ్వర్‌ జిల్లాలో రైల్వే చరిత్రలోనే ఘోర ప్రమాదం సంభవించింది. హౌరా నుంచి చెన్నై వస్తున్న కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఒరిస్సాలోని బాలాసోర్‌ దగ్గరలోని బహానగర్‌ బజార్‌ స్టేషన్‌ సమీపంలో అదే ట్రాక్‌పై ఉన్న గూడ్స్‌ రైలును శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ఢీకొట్టింది. అదే సమయంలో పక్క ట్రాక్‌లో యశ్వంత్‌పూర్‌ నుంచి హౌరా వెళుతున్న ఎక్స్‌ప్రెస్‌ రైలు కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలు యశ్వంత్‌పూర్‌ హౌరా రైలుకు తగిలాయి. దీంతో కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ 12 బోగీలు పడ్డాయి. యశ్వంత్‌ పూర్‌ హౌరా రైలు 5 బోగీలు పట్టాలు తప్పాయి. ఇప్పటిదాకా 278 మంది వరకు మరణించినట్లు తెలిసింది. కాగా 900 మందికి పైగా గాయపడిన ప్రయాణికులను బాలాసోర్‌ మెడికల్‌ ఆసుపత్రికి తరలించారు. మృతులకు పీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు పరిహారం ప్రకటించారు. వందల సంఖ్యలో ప్రయాణికులు గాయపడగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కేవలం నిమిషాల వ్యవధిలోనే పట్టాలపై ఈ భారీ విషాదం చోటుచేసుకుందని తెలుస్తోంది. అధికారులు, ప్రత్యక్ష సాక్షులు వెల్లడిరచిన వివరాల ప్రకారం. రాత్రి ఏడు గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం 6.50 గంటల నుంచి 7.10 మధ్యలో ఈ ఘోరం జరిగింది. ఆ సమయంలో ప్రయాణికులు నిద్రలో ఉన్నట్లు తెలుస్తోంది. 

స్థానిక అధికారుల కథనం ప్రకారం.. 

బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్‌లోని హావ్‌డాకు వెళ్తున్న బెంగళూరు-హావ్‌డా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ బాలేశ్వర్‌ సమీపంలోని బహానగా బజార్‌ వద్ద శుక్రవారం రాత్రి దాదాపు 7 గంటల సమయంలో తొలుత పట్టాలు తప్పింది. ఫలితంగా దాని పలు బోగీలు పక్కనే ఉన్న ట్రాక్‌పై పడిపోయాయి. వాటిని షాలిమార్‌-చెన్నై సెంట్రల్‌ కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది. దాంతో కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 15 బోగీలు బోల్తాపడ్డాయి. ఈ ప్రమాదం అక్కడితో ఆగిపోలేదు. బోల్తాపడ్డ కోరమండల్‌ కోచ్‌లను పక్కనున్న ట్రాక్‌పై దూసుకొచ్చిన గూడ్సు రైలు ఢీకొంది. మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకోవడంతో ప్రమాదం తీవ్రత భారీగా పెరిగింది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా చాలా మంది పట్టాల మధ్యలో చిక్కుకొని ఉన్నారని అధికారులు తెలిపారు. వారిని వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే ప్రమాదం సమయంలో రెండు రైళ్లు అతి వేగంతో ప్రయాణించడంతో తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని సమీపంలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ బోగీల కింద అనేక మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారి కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌, ఓడీఆర్‌ఎఫ్‌ ముమ్మరంగా గాలిస్తోంది. అటు భారత ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తంగా 1200 మంది సిబ్బంది ఈ సహాయకచర్యల్లో పాల్గొన్నారు.

ఒడిశాకు ప్రధాని మోదీ..

ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు సమీక్ష చేపట్టారు. రైల్వే శాఖ ఉన్నతస్థాయి అధికారులతో సమావేశమైన ఆయన.. పరిస్థితిపై ఆరా తీశారు. మరోవైపు, ప్రధాని ఈ రోజు ఒడిశా రానున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడిరచాయి. తొలుత బాలాసోర్‌లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లి ప్రధాని పరిశీలించనున్నారు. అనంతరం కటక్‌లోని ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించనున్నట్లు తెలుస్తోంది.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !