ఉత్తమ నటుడిగా తాను అందుకున్న తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు - 2024ను అభిమానులకు అంకితమిస్తున్నట్టు అల్లు అర్జున్ తెలిపారు. ‘పుష్ప 2’ చిత్రానికిగానూ ఆయన్ను ఈ పురస్కారం వరించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్కు అవార్డు అందజేశారు. మెమెంటో, ప్రశంసా పత్రంతోపాటు నగదు పురస్కారం అందించారు.
గద్దర్ అవార్డ్స్...విజేతలు వీరే..
‘‘గద్దర్ అవార్డు వేడుక నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నిర్మాత దిల్రాజుకు ధన్యవాదాలు. ఈ పురస్కారం నాకు దక్కిందంటే కారణం దర్శకుడు సుకుమార్. ఆయన వల్ల ఇది సాధ్యమైంది. ‘పుష్ప 2’ టీమ్కి థాంక్స్. ‘పుష్ప 1’ని హిందీలో విడుదల చేయమని రాజమౌళి చెప్పకపోయి ఉంటే ఇంత క్రేజ్ ఉండేది కాదు. ఈ సందర్భంగా ఆయనకు థాంక్స్. ‘పుష్ప 2’కిగానూ నేను అందుకున్న తొలి అవార్డు ఇది. ఎంతో ప్రత్యేకం. ఈ అవార్డును అభిమానులకు అంకితమిస్తున్నా. ఈ వేడుక ప్రతి ఏడాదీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నారు. అనంతరం ఆ మూవీలోని డైలాగ్ చెప్పి అభిమానులను అలరించారు.
గర్వంగా ఉంది: బాలకృష్ణ
గద్దర్ పురస్కారాల్లో భాగంగా ‘ఎన్టీఆర్ నేషనల్ అవార్డు’ అందుకున్నారు నందమూరి బాలకృష్ణ. అనంతం ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎంతో మంది కళాకారులు మన ప్రతిభను ప్రపంచవ్యాప్తం చేశారు. తెలంగాణ ముద్దుబిడ్డ గద్దరన్న పేరు మీద ఈ అవార్డులను ప్రదానం చేయడం సంతోషం. అందుకు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ అవార్డును ప్రారంభించారు. చాలా మంది ఈ అవార్డుల పొందారు. పదేళ్ల తర్వాత మళ్లీ నాకు ఈ అవార్డును ఇవ్వడం సంతోషంగా ఉంది. నా కుటుంబం తరుఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. నాకు అవార్డు ద్వారా ఇచ్చిన నగదును బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి ఇచ్చినట్టే. నటనలో ప్రయోగాలు చేసిన నటధీరుడు ఎన్టీఆర్. ప్రతి తెలుగు వాడు తాను తెలుగు బిడ్డనని సగర్వంగా చెప్పుకొనేలా చేసిన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తికి బిడ్డనైందుకు, అవార్డు అందుకుంటున్నందుకు గర్వంగా ఉంది. ఈ సందర్భంగా అవార్డులు అందుకున్న అందరికీ శుభాకాంక్షలు’’ అని బాలకృష్ణ పేర్కొన్నారు.