శ్రీచైతన్య సిబ్బంది చితకబాదటం వల్లే...

0


  • సాత్విక్‌ రిమాండ్‌ రిపోర్ట్‌లో కీలక అంశాలు.

నార్సింగిలని శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థి సాత్విక్‌ క్లాస్‌రూమ్‌లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సాత్విక్‌ మృతిపై ఇంటర్‌ బోర్డ్‌ కమిటీ వేసి విచారణ చేపట్టింది. ప్రాథమిక నివేదికను కూడా వెల్లడిరచింది. ఇక, సాత్విక్‌ కేసులో పోలీసుల రిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. రిపోర్టు ‍ప్రకారం.. ఆత్మహత్య చేసుకున్న సాత్విక్‌ కేసు మొత్తం కాలేజీ ఫ్యాకల్టీ, ప్రిన్సిపాల్‌ చుట్టే తిరుగుతోంది. కాలేజీ ఫ్యాకల్టీ తీవ్రమైన వేధింపుల కారణంగానే సాత్విక్‌ బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు తేల్చారు. సాత్విక్‌ను అసభ్యపదజాలంతో దూషించటం వల్లే మనస్తాపం చెందాడని పేర్కొన్నారు. విద్యార్థుల ముందు పదే పదే కొట్టడం వల్లే హార్ట్‌ అయ్యాడని రిమాండ్‌ రిపోర్ట్‌లో పోలీసులు స్పష్టం చేశారు. ఆచార్య తో పాటు ప్రిన్సిపల్‌ కృష్ణారెడ్డి తరచుగా తిట్టడంతోనే మానసికంగా సాత్విక్‌ కృంగిపోయారు. చనిపోయే రోజు పేరెంట్స్‌ వచ్చి వెళ్ళగానే స్టడీ అవర్‌లో సాత్విక్‌ను ఆచార్య, కృష్ణారెడ్డి చితకబాదారు. ఇంట్లో వాళ్ళని తిడుతూ ఆచార్య, కృష్ణారెడ్డి బూతులు మాట్లాడినట్టు పోలీసులు రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. హాస్టల్‌లో సైతం సాత్విక్‌కు వార్డెన్‌ నుంచి వేధింపులు ఎదురయ్యాయి.

సాత్విక్‌ సూసైడ్‌ నోట్‌ ఈ కేసులో కీలకంగా మారింది. దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. సాత్విక్‌ తన సూసైడ్‌ నోట్‌లో కళాశాల ప్రిన్సిపల్‌ కృష్ణారెడ్డి, వైస్‌ ప్రిన్సిపల్‌, ఆచార్య, క్యాంపస్‌ ఇంచార్జి నరేష్‌, శోభన్‌లు తనను వేధిస్తున్నారంటూ రాశాడు. వారి నలుగురిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. పోలీసులు సైతం రిమాండ్‌ రిపోర్ట్‌లో ఆచార్య, కృష్ణారెడ్డిల పేర్లతో పాటు మిగిలిన ఇద్దరి పేర్లను సైతం చేర్చారు. సాత్విక్‌ ఆత్మహత్యపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓ కమిటీ సైతం వేశారు. ఈ కమిటీ రిపోర్ట్‌ ఆధారంగానే యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని వెల్లడిరచారు. నివేదికలో భాగంగా కాలేజీలో సాత్విక్‌ అడ్మిషన్‌ లేదని కమిటీ తెలిపింది. ఒక కాలేజీలో అడ్మిషన్‌.. మరో కాలేజీలో క్లాసులు అని రిపోర్టులో స్పష్టం చేసింది. కాలేజీలో వేధింపులు నిజమేనని తెలిపింది. ర్యాగింగ్‌ లాంటి వాటిపైన ఇంకా విచారణ చేయాల్సి ఉందని కమిటీ పేర్కొంది. 

కఠిన చర్యలా ? కంటి తుడుపు చర్యలా ? 

ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారుతోంది. ప్రవేటు కళాశాలల ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్న చూసిచూడనట్టు వ్యవహరిస్తున్న ప్రభుత్వాలు ఇప్పటికైనా కఠిన చర్యలకు ఉపక్రమిస్తుందా ? లేదా ఎప్పటిలాగే కంటితుడుపు చర్యలతో సరిపెడుతుందా చూడాలి. మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరిగిన తర్వాత ఇలాగే కమిటీలు, చర్యలు అంటూ సాగదీత ధోరణితో ప్రవేటు విద్యాసంస్థలకు కొమ్ముకాస్తుందా అనేది కాలమే సమాధానం చెప్పాలి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !