చదివింది కేవలం పదవ తరగతి. పదిసార్లు తానే ఎగ్ డొనేట్ చేసింది. రెండు సార్లు సరోగసీ మదర్ అవతారం ఎత్తింది. అద్దె గర్భం దాల్చి బిడ్డలకు జన్మనిచ్చి, ఒరిజినల్ పేరెంట్స్ చేతుల్లో పెట్టింది. ఈ కష్టాలన్నీ ఎందుకు అనుకుందో ఏమో తానే సొంత దుకాణం తెరిచింది. ఫెర్టిలిటీ సెంటర్లకు ఎగ్ డోనర్లను సప్లయ్ చేయడం, గర్భాన్ని అద్దెకు ఇచ్చే మహిళలను కూడా తానే సప్లయ్ చేయడం మొదలుపెట్టింది. మేడ్చల్లో ఈ ఇల్లీగల్ దందాను కుటీర పరిశ్రమలా నడుపుతున్న లక్ష్మీ రెడ్డి కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మేడ్చల్ సరోగసి కేసులో విస్తుపోయే అంశాలు వెలుగు చూస్తున్నాయి. లక్ష్మిపై BNS 318(4),61(2) యాక్ట్ కింద రెండు కేసులు, ART యాక్ట్ కింద మరో రెండు కేసులు, SURROGACY యాక్ట్ కింద ఇంకో 4 కేసుల నమోదు చేశారు పోలీసులు. ఆగస్టు 14న పక్కా సమాచారంతో సరోగసి జరుగుతున్న ఓ ఇంట్లో సోదాలు చేసినట్లు వెల్లడిరచారు. సోదాల సమయంలో సరోగెంట్ తల్లులతోపాటు వివిధ ఫెర్టిలిటీ హాస్పిటల్స్కు చెందిన డాక్యుమెంట్స్ని గుర్తించినట్లు FIRలో పోలీసులు వెల్లడిరచారు. ఈ కేసులో సూత్రధారి లక్ష్మితోపాటు ఆమె కొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు.
ఏజెంట్గా పనిచేసి...తర్వాత సొంతంగా దుకాణం తెరిచి...
ఏపీలోని చిలకలూరిపేటకు చెందిన లక్ష్మి రెడ్డిపై 2024లో ముంబైలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం హైదరాబాద్కు చేరుకున్న లక్ష్మి రెడ్డి.. కొడుకు సురేందర్ రెడ్డి, కూతురుతో కలిసి ఈ దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతే కాకుండా.. లక్ష్మి తన ఇంటి ఫస్ట్ ఫ్లోర్ లోని రూమ్ బ్యాచిలర్స్కి మాత్రమే అద్దెకిచ్చి వారి దగ్గర నుంచి వీర్యం సేకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మొదట్లో నిందితురాలు లక్ష్మీ రెడ్డి ఏజెంట్గా పనిచేసినట్లు FIRలో పోలీసులు పేర్కొన్నారు . మొదట్లో తానే ఎగ్ డొనేట్ చేసేది. సరోగేట్ మదర్ అవతారం కూడా ఎత్తింది. భారీగా డబ్బు సంపాదించాలంటే ఇలా లాభం లేదనుకుని, మేడ్చల్లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని, అందులో తన సొంత దుకాణం షురూ చేసింది. మాదాపూర్, అమీర్పేట్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతాల్లో ఉన్న ఫర్టిలిటీ సెంటర్ల తో పరిచయాలు పెంచుకొని దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు . లక్ష్మి రెడ్డి, కొడుకు సురేందర్ రెడ్డి ఏజెంట్లుగా పని చేస్తూ.. అండాలు కావాలన్నా.. సరోగసి కోసం మహిళలు కావాలన్నా అరేంజ్ చేస్తామని వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. LLH ఫెర్టిలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటేడ్ పేరుతో ఫెర్టిలిటీ సెంటర్లతో తనకు ఉన్న కాంటాక్ట్స్ను ఉపయోగించుకుని, వాళ్లకు ఎగ్ డొనేట్ చేసే మహిళలను సమకూర్చేవారు. అలాగే జంటలకు, ఫెర్టిలిటీ క్లినిక్స్కు సరోగేట్ మదర్స్ను కూడా అందుబాటులో ఉంచేది. అటు ఫెర్టిలిటీ సెంటర్ల దగ్గర కమిషన్ తీసుకునేది. ఇటు పిల్లల కోసం తహతహలాడే జంటల నుంచి భారీగా డబ్బు గుంజేదని పోలీసులు FIRలో పేర్కొన్నారు. నిందితురాలు లక్ష్మికి 1994లో వివాహం అయింది. వ్యక్తిగత కారణాలతో భర్తకు దూరంగా ఉంటూ.. కొడుకు కూతురితో కలిసి ఉంటోంది ఆమె. కొడుకుతో కలిసి ఫెర్టిలిటీ సెంటర్లకు ఏజెంట్గా అవతారం ఎత్తింది లక్ష్మి. మూడు సార్లు అండాలు ఇస్తే 30 వేల రూపాయలు ఇస్తానని, సరోగసి ద్వారా పిల్లలను కనిస్తే 4 లక్షలు ఇస్తానని మహిళలకు వల వేసినట్లు విచారణలో తేలింది. ఇక ఎగ్ డోనర్లను పంపిస్తే రూ. 40 వేల కమీషన్..! సరోగేట్ మదర్కు రూ. 60 వేల కమీషన్ ఇచ్చే లక్ష్మీ.. జంటల నుంచి భారీగానే వసూలు చేసింది. అలాగే ఇప్పటివరకు 50మందికి పైగా సరోగసీ చేయించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. నిందితురాలు లక్ష్మి సరోగసి ద్వారా బిడ్డలను కని ఇచ్చిన మహిళల లిస్ట్, వాళ్లకు ఇచ్చిన డబ్బుల వివరాలు కోసం డైరీ మెయింటైన్ చేస్తుందని పోలీసులు తెలిపారు.లక్ష్మీ రెడ్డి ఏజెంట్ గా ఉన్న 6 హాస్పిటల్స్ కి ఇప్పటికే పోలీసులు నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్లోని హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్, అను టెస్ట్ ట్యూబ్ సెంటర్, ఫెర్టీ కేర్, EVA IVF, అమూల్య IVF, శ్రీ ఫెర్టిలిటీ సెంటర్లకు పోలీసుల నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు . లక్ష్మిని కస్టడీకి కోరనున్నారు పేట్ బషీరాబాద్ పోలీసులు. సోమవారం(ఆగస్టు 18) మేడ్చల్ కోర్టులో కస్టడీ పిటీషన్ దాఖలు చేయనున్నారు. ఐదు రోజులపాటు కస్టడీ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లక్ష్మిని కస్టడీకి తీసుకుని విచారిస్తే, మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు.