BJP Vijaya Sankalpa Sabha in Chevella: ప్రధాని సీటు ఖాళీగా లేదు..కేసీఆర్‌ ! మళ్ళీ మోదీనే ప్రధాని !

0
                    

  • యువకుల జీవితాలతో ఆడుకుంటున్నారు.
  • తెలంగాణలో హైవేల కోసం లక్షల కోట్లు ఖర్చు చేస్తున్న కేంద్రం
  • కేంద్రం పథకాలు క్షేత్రస్థాయికి చేరటం లేదు.
  • చేవెళ్ళ సభలో గర్జించిన అమిత్‌ షా !
తెలంగాణలో కేసీఆర్‌​ ప్రభుత్వాన్ని గద్దే దింపే వరకూ బీజేపీ కార్యకర్తలు విశ్రమించరని కేంద్ర మంత్రి అమిత్‌​ షా అన్నారు. పేపర్‌ లీకేజ్‌పై ప్రశ్నించారని బండి సంజయ్‌ను జైల్లో పెట్టారని ఆరోపించారు. జైళ్లకు వెళ్లేందుకు తమ పార్టీ నేతలు, కార్యకర్తలు భయపడరని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. కేసీఆర్‌​ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. తెలంగాణలో పదో తరగతి పేపర్లు, టీఎస్‌పీఎస్‌సీ పేపర్లు ఎందుకు లీక్‌​ అవుతున్నాయని అమిత్‌​ షా ప్రశ్నించారు. యువకుల జీవితాలతో కేసీఆర్‌ ఆటలాడుతున్నారని మండిపడ్డారు. లీకేజీలతో నిరుద్యోగుల జీవితాలను అంధకారంలో నెట్టారని విమర్శించారు. లీకేజీపై కేసీఆర్‌ ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆరోపించారు. టీఎస్‌పీఎస్‌సీ లీకేజీపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు.

ప్రధాని సీటు ఖాళీగా లేదు...కేసీఆర్‌.

బండి సంజయ్‌ను కేసీఆర్‌ జైల్లో వేయించారు. పేపర్‌ లీకేజ్‌పై ప్రశ్నించారని బండి సంజయ్‌ను జైల్లో పెట్టారు. జైళ్లకు వెళ్లేందుకు బీజేపీ కార్యకర్తలు భయపడరు. 24 గంటల్లో బండి సంజయ్‌కు బెయిల్‌ వచ్చింది. ఈటలను అసెంబ్లీకి వెళ్లకుండా చేయాలనుకున్నారు. కేంద్రం అందించే పథకాలు క్షేత్రస్థాయికి చేరడం లేదు. మోదీని ప్రజల నుంచి కేసీఆర్‌ దూరం చేయలేరు. కేంద్రంలో ఫుల్‌ పిక్చర్‌ చూసే ముందు తెలంగాణలో ట్రైలర్‌ చూస్తారు. కేసీఆర్‌ ప్రధాని కావాలని కలలు కంటున్నారు.  ప్రధాని సీటు ఖాళీగా లేదు...కేసీఆర్‌. వచ్చే ఎన్నికల తర్వాత కూడా మోదీనే ప్రధాని. కేసీఆర్‌.. ముందు సీఎం సీటు కాపాడుకుంటే చాలు. అధికారంలోకి వస్తే విమోచన దినం ఘనంగా నిర్వహిస్తాం. మజ్లిస్‌కు బీజేపీ భయపడేది లేదు. బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తాం. కారు స్టీరింగ్‌ మజ్లిస్‌ చేతుల్లో ఉంది  అని అమిత్‌ షా  విమర్శించారు. 

మూడేళ్లలో నాబార్డు ద్వారా రూ.60 వేల కోట్లు అందించాం 

తెలంగాణలో హైవేల కోసం లక్ష కోట్లు ఖర్చు చేసినట్లు అమిత్‌​ షా అన్నారు. కేంద్ర పథకాలను రాష్ట్రం సరిగ్గా అమలు చేయడం లేదని ఆరోపించిన ఆయన.. కేంద్రం అందించే వేల కోట్లు ప్రజలకు అందుతున్నాయా? అని కార్యకర్తలను అడిగారు. మూడేళ్లలో నాబార్డు ద్వారా రూ.60 వేల కోట్లు అందించామని పేర్కొన్నారు. రామగుండం విద్యుత్‌ కేంద్రం, సికింద్రాబాద్‌ స్టేషన్‌ ఆధునికీకరణ, ఎంఎంటీఎస్‌ విస్తరణకు నిధులిచ్చామని ప్రకటించారు.

చేవెళ్ల ప్రాంత అభివృద్ధికి కొండా వెంకట రంగారెడ్డి కుటుంబం కృషి చేసిందని అమిత్‌ షా అన్నారు. హైదరాబాద్‌- బీజాపూర్‌ హైవేకు సీఎం కేసీఆర్‌ భూమి ఇవ్వటం లేదని చెప్పారు. ప్రభుత్వ ప్రాజక్టులను కేసీఆర్‌ కుటుంబం ఏటీఎం మాదిరి వాడుకుంటున్నారని తెలిపారు. పత్తి రైతులను ఆదుకునేందుకు తెలంగాణకు మోదీ మెగా టెక్స్‌ టైల్స్‌ పార్క్‌ ఇచ్చారని చెప్పారు. ప్రజలపై జులుం బంద్‌ చేసి మంచి పాలన అందించాలని కేసీఆర్‌కు షా చురకలు అంటించారు.

కాగా, చేవెళ్లలో జరిగిన ‘‘విజయ సంకల్ప సభ’’లో అమిత్‌ షా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ తో పాటు, కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్‌, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, తెలంగాణ, మధ్యప్రదేశ్‌ ఇన్‌ఛార్జిలు తరుణ్‌ చుగ్‌, మురళీధర్‌ రావు, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, ఎమ్మెల్సీ ఏవీఎన్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా బసవేశ్వర విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు.








కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !