దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర ఓటమి దిశగా కొనసాగుతోంది. ఈ క్రమంలో చాలా మంది నిపుణులను ఈ ఫలితాలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అయితే ఈ ఓటమి వెనుక ముఖ్యంగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలు, ఆయన నిర్ణయాలతోపాటు మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
ఉద్యమంతో ఎదిగి.. ఆశాకిరణంగా కనిపించి
2011 దిల్లీ జంతర్మంతర్.. అవినీతికి వ్యతిరేకంగా జన్లోక్పాల్ వ్యవస్థను తీసుకురావాలని గాంధేయవాది అన్నాహజారే దీక్ష.. ఆ వేదికపై కళ్లద్దాలు పెట్టుకొని అటూ ఇటూ తిరుగుతున్న ఒక మధ్యవయస్కుడు మీడియా దృష్టిలో పడ్డాడు. మధ్యతరగతికి ప్రతిబింబంగా ఉన్న ఆయనే అరవింద్ కేజ్రీవాల్. అన్నా హజరే ఉద్యమంతో ఎదిగి అనంతరం ఆమ్ఆద్మీ పార్టీని నెలకొల్పి దేశంలో అవినీతి వ్యతిరేక ఉద్యమకారులకు ఆశాకిరణంగా కనిపించాడు. ఎమర్జెన్సీ కాలంలో లోక్నాయక్ జయప్రకాశ్ ఉద్యమం తరహాలో దేశానికి ఆదర్శవంతంగా మారుతాడని ప్రజాస్వామ్యవాదులు ఆకాంక్షించారు.అయితే జన్లోక్పాల్ అని నినదించిన కేజ్రీవాల్ కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చుబెట్టి తన అధికార నివాసాన్ని మరమ్మతులు చేసుకోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమైంది.
సామాన్యుడి మాదిరిగా..
ఆప్ ప్రజలలో మొదట సామాన్యుల పార్టీగా వెలుగులోకి వచ్చింది. ఆ క్రమంలో కేజ్రీవాల్ తన రాజకీయ జీవితాన్ని ‘ఆమ్ ఆద్మీ’ నినాదంతో సాధారణ జీవనశైలితో ప్రారంభించారు. కాటన్ చొక్కా, చిన్న ఫ్లాట్, చౌకైన కారులో ప్రయాణం సాగించారు. దీంతో ఆయన క్రమంగా ప్రజల్లో ఆదరణ దక్కించుకున్నారు. కానీ కేజ్రీవాల్ ప్రయాణం క్రమంగా మారిపోయింది. 40 కోట్ల రూపాయల విలాసవంతమైన షీష్ మహల్ నిర్మాణం సహా అనేక అంశాలు ఆయనపై ఓటర్లలో నిరాశను పెంచాయని చెప్పవచ్చు. ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీ సామాన్య ప్రజల కోసం పనిచేయాలని ఆశించారు. కానీ భారీ వృథా వ్యయం కాస్తా, విరుద్ధంగా మారిపోయింది.
తప్పుడు వాగ్దానాలు
కేజ్రీవాల్ అనేక వాగ్దానాలు చేశారు. కానీ వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారు. ఇవి ఓటర్లలో ఆయన విశ్వసనీయతను దెబ్బతీశాయి. 2013లో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఆప్ తొలిసారి ఆవిర్భవించినప్పుడు కీలక వాగ్దానాలను చేసింది. కానీ కొన్ని ఉచితాలు తప్ప మిగతావి అమలు కాలేదు. నీటి కనెక్షన్లు, వాయు కాలుష్యాన్ని తగ్గించడం వంటి అనేక ఇతర వాగ్దానాలు నెరవేరలేదు. ఉపాధి బడ్జెట్ 2023 కూడా ఉద్యోగ సృష్టికి సంబంధించిన వాగ్దానాలను నెరవేర్చడంలో ఆప్ విఫలమైంది.
అనేక వివాదాలు..
గోవా, గుజరాత్ ఎన్నికల్లో కేజ్రీవాల్ డబ్బు ఖర్చు ఆరోపణలపై ఆయనిచ్చిన సమాధానాలు కూడా ఓటర్లలో ప్రశ్నలు సృష్టించాయి. భవిష్యత్తులో ఈ వివాదాలు కేజ్రీవాల్ నాయకత్వానికి మరింత దెబ్బతీయగలవని ఆందోళనలు వచ్చాయి. ఇని కూడా ఓటర్లలో క్రమంగా మార్పుకు కారణమయ్యాయని చెప్పవచ్చు.
వ్యతిరేక భావన
ఢల్లీి ఎన్నికల్లో ఆప్ ప్రభుత్వానికి పెద్ద దెబ్బ రావడానికి ప్రభుత్వ వ్యతిరేకత కూడా కీలక పాత్ర పోషించింది. 2015 నుంచి 2020 వరకు ఢల్లీిలో ఆప్ గణనీయమైన విజయాలు సాధించినప్పటికీ, దీని మొదటి రెండు పదవీకాలాల సమయంలో ఆరోగ్యం, విద్య వంటి రంగాలలో మాత్రమే పనితీరును కనబరిచారు. ఆ క్రమంలో మెరుగైన గాలి నాణ్యతతో సహా నెరవేరని అనేక వాగ్దానాలు ఢల్లీి ఓటర్లను ఇబ్బంది పెట్టాయి. దీంతో గత 10 సంవత్సరాల ఆప్ పాలనలో ఓటర్లు అనేక ఆరోపణలను సాకులుగా చూశారు. దీంతో ఈసారి బీజేపీ వాగ్దానాలపై ఓటర్లు మక్కువ చూపించారు.
వరుస విజయాలతో..
దిల్లీ ఓటర్లకు దేశంలోని ఇతర ప్రాంతాల ఓటర్లకు చాలా తేడా ఉంటుంది. ఎక్కువ మధ్యతరగతి ఉద్యోగ ఓటర్లతో పాటు దేశం నలుమూలల నుంచి వచ్చిన వారితో సహజంగానే చైతన్యం ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఆయన సారథ్యంలో ఏర్పడిన ఆమ్ఆద్మీ పార్టీకి వారు మద్దతు ప్రకటించారు. స్థాపితమైన కొద్దినెలల్లోనే 2013లో జరిగిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 సీట్లకు గాను ఏకంగా 28 సీట్లు గెలుచుకున్నారు. అనంతరం కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసినా కొద్దికాలానికే పడిపోవడంతో 2015లో ఎన్నికలు నిర్వహించగా ఏకంగా 67 సీట్లు గెలవడంతో ప్రధాన రాజకీయపక్షాలు ఉలిక్కిపడ్డాయి. తరువాత 2020లో జరిగిన ఎన్నికల్లో 62 సీట్లు గెలుచుకున్నారు. మరోసారి విజయం సాధిస్తామని ఆశిస్తున్న తరుణంలో ఓటమి పాలవడం గమనార్హం.
అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించి అవే ఆరోపణల్లో కూరుకుపోయి..
అవినీతి వ్యతిరేక ఉద్యమానికి నేతృత్వం వహించిన అన్నాహజారే అప్పట్లో కేజ్రీవాల్ను పార్టీ పెట్టవద్దని కోరారట. అయితే అందుకు భిన్నంగా కేజ్రీవాల్ ఆమ్ఆద్మీని నెలకొల్పి దిల్లీ అంటే ఆమ్ ఆద్మీకి కోటగా మార్చాడు. మూడోసారి సీఎంగా ఉన్న పదవీకాలంలో ఆమ్ఆద్మీ అవినీతి ఆరోపణలతో కూరుకుపోయింది. పలువురు మంత్రులతో పాటు సీఎంగా ఉన్న కేజ్రీవాల్ మద్యం కుంభకోణంలో జైలుకు వెళ్లాల్సివచ్చింది. మద్యం బాటిళ్లపై ‘ఒకటి కొంటే ఒకటి ఉచితం’ అనే కొత్త విధానం తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఢల్లీిని మద్యపాన ప్రియుల నగరంగా మారుస్తోందన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రజల్లో క్రమంగా పార్టీపై నమ్మకం తగ్గిపోయింది. అవినీతికి వ్యతిరేకంగా ఆవిర్భవించిన పార్టీ అదే ఆరోపణల్లో కూరుకుపోవడంపై మీడియాలోనూ, ప్రజల్లోను పెద్ద ఎత్తున చర్చజరిగింది. సంప్రదాయ రాజకీయపక్షాలన్నీ అవినీతితో ఉన్నవని ఆరోపించిన కేజ్రీవాల్ అందుకు భిన్నంగా పార్టీ నిర్మాణం ఉంటుందని ప్రకటించినా ఆచరణలో విఫలమయ్యాడు.
ప్రజాధనంతో ‘శీష్మహల్’
దిల్లీ సీఎం అధికార నివాసానికి దాదాపు 33 కోట్ల రూపాయల ప్రజాధనంతో మరమ్మతులు చేపట్టినట్టు ‘కాగ్’ నివేదిక పేర్కొనడం భాజపాకు ఆయుధమైంది. విపక్షాలు ఇదే అంశాన్ని భారీ ఎత్తున ప్రచారం చేశాయి. దిల్లీ ఓటర్లలో ఎక్కువమంది విద్యాధికులు కావడంతో ఈ అంశాన్ని గుర్తించారు. కేజ్రీవాల్కు వ్యతిరేకంగా ఓటు వేశారు.
‘విష’ ప్రచారం పనిచేయలేదు..
యమునా కాలుష్యం హామీ కూడా దెబ్బతీసిందని చెప్పవచ్చు. యమునా నదిని శుభ్రపరుస్తానని ఆయన పదే పదే హామీ ఇచ్చినప్పటికీ, నది మాత్రం కలుషితంగానే ఉంది. ఆప్ 2015 మ్యానిఫెస్టోలో ఈ నదిని 100% శుభ్రపరుస్తామని హామీ ఇచ్చారు, కానీ అది నెరవేరలేదు. హరియాణా ప్రభుత్వం యుమునానది నీటిని విషంగా మార్చి సరఫరా చేస్తుందన్న ప్రచారం పనిచేయలేదు. ప్రధాని మోదీ తాను ఆ నీటినే తాగుతానని ప్రచారంలో స్పష్టం చేశారు. దీంతో కేజ్రీవాల్ను ఓటర్లు నమ్మలేదు. హరియాణా సీఎం సైనీ సైతం ఆ నీటిని తాగి చూపించడంతో కేజ్రీవాల్ ఆరోపణలకు హేతుబద్ధత లభించలేదు.
దేశ నాయకుడిగా ఎదగాలని..
ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ స్థానే ఆమ్ఆద్మీపార్టీని తీర్చిదిద్దాలని కేజ్రీవాల్ ఆశించారు. దీంతో 2014 ఎన్నికల్లో ఏకంగా వారణాసిలో భాజపా పీఎం అభ్యర్థి నరేంద్రమోదీపై పోటీచేసి దారుణమైన ఓటమి చెందారు. అనంతరం కొన్నిరాష్ట్రాల్లో లభించిన ఓట్ల శాతంతో ఆమ్ఆద్మీని దేశ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా రూపొందించాలని అనుకున్నారు. అయితే ఆందుకు మోడల్గా దిల్లీని రూపొందించలేదు. పంజాబ్లో శిరోమణి అకాలీదళ్, భాజపా విడిపోవడం కాంగ్రెస్ ప్రభావం తగ్గిపోవడంతో ప్రత్యామ్నాయంగా అక్కడి ఓటర్లు ఆమ్ఆద్మీని ఎన్నుకున్నారు. కానీ శాంతి భద్రతల సమస్యతో పాటు మాదక ద్రవ్యాలను అరికట్టకపోవడం...తదితర అంశాలతో దిల్లీలో ఉన్న పంజాబ్కు చెందిన ఓటర్లు భాజపాకు ఓట్లు వేశారు.