ఇన్నర్రింగ్ రోడ్డు కేసులో నారా లోకేశ్ (NARA LOKESH) కు CID అధికారులు నోటీసులు ఇచ్చారు. అక్టోబరు 4న ఉదయం 10గంటలకు CID కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని 41A కింద నోటీసు జారీ చేశారు. లోకేశ్ ప్రస్తుతం దిల్లీలోని అశోకారోడ్లో ఉన్న గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయంలో ఉన్నారు. దీంతో సీఐడీ అధికారులు దిల్లీలోని ఎంపీ కార్యాలయానికి వెళ్లి లోకేశ్కు నోటీసులు అందజేశారు.
41ఏ కింద నోటీసులు
అమరావతి ఇన్నర్ రింగ్రోడ్డు ఎలైన్మెంట్ వ్యవహారంపై గతేడాది నమోదుచేసిన కేసులో A14 గా లోకేశ్ పేరును CID ఇటీవల చేర్చింది. ఈ నేపథ్యంలో హైకోర్టులో లోకేశ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై శుక్రవారం ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపించారు. ఈ కేసులో లోకేశ్కు సీఆర్పీసీ 41A కింద నోటీసులు ఇస్తామని.. దానికి సంబంధించిన నిబంధనలు పాటిస్తామని ఏజీ కోర్టుకు తెలిపారు. సీఆర్పీసీ 41ఏ నోటీసులు అంటే అరెస్ట్ ప్రస్తావన రానందున.. ముందస్తు బెయిల్పై విచారణను ముగిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. ఈక్రమంలో సీఐడీ అధికారులు లోకేశ్కు 41A కింద నోటీసులు జారీ చేశారు.