Pavan meets Babu : చంద్రబాబుతో పవన్‌కళ్యాణ్‌ భేటీ...రాజకీయ వర్గాల్లో ఆసక్తి !

0

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌  ఆకస్మిక భేటీ అయ్యారు. శనివారం సాయంత్రం పవన్‌ కల్యాణే స్వయంగా హైదరాబాద్‌లోని చంద్రబాబు ఇంటికెళ్లి మరీ కలిశారు. పవన్‌ను సాదరంగా స్వాగతించిన చంద్రబాబు.. సుమారు గంటపాటు ఇద్దరూ ఏకాంతంగా పలు విషయాలపై చర్చించుకున్నారు. ముఖ్యంగా ఏపీలో తాజా పరిస్థితులు, ప్రజా సమస్యలపై చర్చించినట్లుగా తెలుస్తోంది.

ఆకస్మిక భేటీ...పొత్తులపై చర్చలకేనా !

సుమారు గంటపాటు జరిగిన భేటీలో టీడీపీ-జనసేన పొత్తులపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. వైకాపా ప్రభుత్వ విధానాలపై ఇరు పార్టీలు కలిసి ఐక్యంగా ఎలా ముందుకెళ్లాలనే దానిపై ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. పొత్తులపై ఇప్పటికిప్పుడు స్పష్టమైన నిర్ణయం ప్రకటించకపోయినప్పటికీ.. రాజకీయంగా ఎలా ముందుకెళ్లాలనేదానిపై సమాలోచనలు జరిపినట్టు తెలుస్తోంది. ఇటీవలే ఢల్లీిలో రెండ్రోజుల పాటు పర్యటించిన పవన్‌ కల్యాణ్‌ బీజేపీ పెద్దలను కలిసిన సంగతి తెలిసిందే. ఆ మధ్యే పవన్‌-బాబు భేటీ ఉంటుందని భావించినప్పటికీ అది జరగలేదు. ఇప్పుడు సడన్‌గా సమావేశం కావడం, అది కూడా పవనే స్వయంగా బాబు ఇంటికెళ్లడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యింది. టీడీపీ-జనసేన కలిసే రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తాయని అధికార పార్టీ ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పిస్తోంది.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనీవ్వమని ఇప్పటికే పవన్‌ కల్యాణ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. వాస్తవానికి బీజేపీతో మిత్రబంధం కొనసాగిస్తున్న పవన్‌.. ఈ మధ్య ఎందుకో ఈ రెండు పార్టీలు కలిసి కార్యక్రమాలు చేపట్టిన సందర్భాల్లేవ్‌. పైగా బీజేపీ నేతలు బహిరంగంగానే పవన్‌తో మాకేంటి..? మేం ఒంటరిగానే పార్టీని బలోపేతం చేసుకుంటామని చెప్పుకుంటున్నారు. మరోవైపు ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీపై ఓ జాతీయ మీడియాలో చంద్రబాబు మాట్లాడుతూ ఆకాశానికెత్తేశారు. మోదీ అభివృద్ధి విధానాలతో తాను ఏకీభవిస్తున్నట్లు కూడా బాబు చెప్పారు. ప్రధాని మోదీ ప్రపంచవ్యాప్తంగా దేశానికి గుర్తింపు తెచ్చారన్నారు. ప్రధాని తెస్తున్న మార్పులు దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాయని.. ఆయన విధానాలను మెరుగుపెడితే 2050 నాటికి భారత్‌దే అగ్రస్థానం అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అంతేకాదు.. దేశాభివృద్ధి కోసం ప్రధాని చేసే పనులకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని చంద్రబాబు తేల్చిచెప్పారు. ఎన్డీఏలో భాగస్వామి కావడమనేది మేటరాఫ్‌ టైమ్‌ అని కూడా బాబు చెప్పేశారు. అటు పవన్‌ ఢల్లీి పర్యటన తర్వాత.. ఇటు మోదీ గురించి చంద్రబాబు ఇలా మాట్లాడిన రోజుల వ్యవధిలోనే ఈ ఇద్దరి భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !