Patanjali Case : పతంజలి యాజమాన్యానికి సుప్రీంకోర్టు వార్నింగ్‌ !

0

పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్‌ బాబా, ఆ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. గత ఉత్తర్వుల్లో న్యాయస్థానం ఏం చెప్పిందో తెలుసుకోలేనంత అమాయకులు కాదని మండిపడిరది. ఈ వ్యవహారంలో తమ తప్పును అంగీకరిస్తూ వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. కోర్టు ఆదేశాల మేరకు నేటి విచారణకు కూడా రాందేవ్‌ బాబా, బాలకృష్ణ వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరూ న్యాయస్థానంలో మరోసారి బేషరతుగా క్షమాపణలు తెలియజేశారు. ‘‘ఆ సమయంలో మేం చేసింది తప్పిదమే. భవిష్యత్తులో ఇలా జరగకుండా జాగ్రత్తగా ఉంటాం. కోర్టు ఆదేశాలను అగౌరవపర్చాలన్న ఉద్దేశం మాకు లేదు’’ అని కోర్టుకు తెలిపారు.

తెలియనంత అమాయకులేం కాదు

వీరి వివరణపై జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ అహసనుద్దీన్‌ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ‘‘గత ఉత్తర్వుల్లో మేం ఏం చెప్పామో తెలియనంత అమాయకులేం కాదు మీరు. నయం చేయలేని వ్యాధులపై ప్రకటనలు ఇవ్వకూడదని మీకు తెలియదా? మీది బాధ్యతారాహిత్యం. మీరు చేసేది మంచి పనే అయినా.. అల్లోపతీని తగ్గించి చూపించకూడదు. మీ క్షమాపణలను పరిశీలిస్తాం. అయితే ఇప్పుడే మిమ్మల్ని వదిలిపెట్టట్లేదు. వారం రోజుల్లోగా దీనిపై బహిరంగ క్షమాపణలు చెబుతూ ప్రకటనలు ఇవ్వండి’’ అని కోర్టు ఆదేశించింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్‌ 23వ తేదీకి వాయిదా వేసింది. ఆధునిక వైద్యవిధానాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పతంజలి ఆయుర్వేద సంస్థపై ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం గతేడాది నవంబర్‌లో ఆ సంస్థను మందలించింది. తమ ఉత్పత్తులు వివిధ రకాల వ్యాధులను నయం చేస్తాయంటూ ‘అసత్య’, ‘తప్పుదోవ’ పట్టించే ప్రకటనలు ఇవ్వొద్దని సూచించింది. దీన్ని ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. అయితే ఈ ఆదేశాలను వీరు ఉల్లంఘించడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేసింది. దీనిపై తాజాగా విచారణ జరిపింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !